రాజు మారినప్పుడల్లా రాజధాని మారదు.. కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా చౌదరి

  • అమరావతి నుంచి రాజధానిని మార్చడం అంత సులువు కాదు
  • అసెంబ్లీ, సెక్రటేరియట్ ఒక్కచోటే ఉండాలి
  • వేరే చోట హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవచ్చు
అమరావతి నుంచి రాజధానిని మార్చడం అంత సులువు కాదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తానంటే ప్రభుత్వం ఒప్పుకోదని అన్నారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. హైకోర్టు ఒక చోట, రాజధాని మరోచోట ఉంటే పెద్ద ఇబ్బందులేమీ ఉండవని అన్నారు. ఒక చోట హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. కానీ, అసెంబ్లీ, సెక్రటేరియట్ లు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.

రాజధాని నిర్మాణంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు జాప్యం చేశారని సుజనా చౌదరి చెప్పారు. దాన్ని అవకాశంగా తీసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని... కానీ, పరిపాలన కేంద్రం మాత్రం ఒకటే ఉండాలని అన్నారు. అప్పుడే అధికార యంత్రాంగానికి, ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు.
Go Back to Shorts
Sujana Chowdary
Jagan
Chandrababu
Telugudesam
YSRCP
BJP

More Telugu News